ముంబై: కరోనా వల్ల అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి ప్రవేశించిందంటూ ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ చేసిన ప్రకటనతో దేశీయ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు బుధవారం తీవ్రరూపం దాల్చాయి. అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు కుదేలు కాగా మన మార్కెట్లు సైతం అదే బాటలో నడిచాయి. దీనికితోడు టెలికం కంపెనీల ఏజీఆర్ చెల్లింపుల సమీక్షకు అనుమతించేది లేదని సుప్రీంకోర్టు కరాఖండిగా తేల్చేయడం బ్యాంకు స్టాక్స్కు ప్రతికూలంగా మారింది. బ్యాంకు స్టాక్స్ను విదేశీ ఇన్వెస్టర్లు తెగ బాదేశారు. కోటక్ మహీంద్రా బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 10%పైనే పతనమయ్యాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇండస్ఇండ్ బ్యాంకులోనూ సమస్యలు ఉన్నాయనే వదంతులతో కంపెనీ షేరు కుదేలయింది. ఇంట్రాడేలో ఇండస్ఇండ్ బ్యాంకు షేరు 38 శాతం నష్టంతో రూ.382.55 వరకు పడిపోగా (ఏడాది నూతన కనిష్ట స్థాయి), ఆ తర్వాత కొంత కోలుకుని 24% నష్టంతో సరిపెట్టుకుంది. 2017 జనవరి తర్వాత సెన్సెక్స్ 29,000 మార్క్ దిగువకు చేరింది.
మాంద్యం భయాలు...
భారత వృద్ధి అంచనాలను తగ్గిస్తూ ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ చేసిన ప్రకటన ఇన్వెస్టర్లను అమ్మకాలకు పురిగొల్పింది. 2020 సంవత్సరంలో భారత జీడీపీ 5.7 శాతం వృద్ధి సాధించొచ్చన్న గత అంచనాలను తాజాగా 5.2 శాతానికి ఎస్అండ్పీ తగ్గించింది. అలాగే, కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి ప్రవేశించినట్టు ప్రకటించింది. ఆసియా పసిఫిక్ వృద్ధి 2020లో సగానికి సగం తగ్గి 3 శాతం లోపునకు పడిపోవచ్చన్న అంచనాలను ఎస్అండ్పీ విడుదల చేసింది.
అంతర్జాతీయ మార్కెట్లు కుదేలు
అంతర్జాతీయంగా ఈక్విటీ, చమురు మార్కెట్లు బుధవారం కుప్పకూలాయి. ఎన్ని ఉద్దీపనలు ప్రకటించినా కానీ, కరోనా ప్రతాపంతో ప్రపంచ వృద్ధి రేటు దారుణంగా పడిపోవచ్చన్న భయాలతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు పోటీపడ్డారు. యూరోప్ మార్కెట్లు లండన్, ప్యారిస్, ఫ్రాంక్ఫర్ట్ ఐదు శాతం పడిపోగా, ఆసియా మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. షాంఘై, హాంకాంగ్, సియోల్, జపాన్ 5 శాతం వరకు నష్టపోయాయి. ప్యారిస్లో అయితే ఒక నెల పాటు షార్ట్ సెల్లింగ్ను నిషేధించారు. అలాగే ఒక రోజు పాటు ట్రేడింగ్ను కూడా నిలిపివేశారు.
అమెరికా, బ్రిటన్ భారీ ప్యాకేజీలు
అమెరికాలో ఇప్పటికే 300 బిలియన్ డాలర్ల పన్ను చెల్లింపులను వాయిదా వేయగా, ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీని సిద్ధం చేస్తున్నట్టు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్ముంచిన్ ప్రకటించారు. అంటే 2008 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యం సమయంలో ప్రకటించిన ప్యాకేజీలను ఇది మించిపోనుంది. కరోనాతో అమెరికాలో నిరుద్యోగ రేటు 20 శాతానికి పెరిగిపోతుందని ముచిన్ పేర్కొన్నారు. ‘‘ప్రజలు ఉద్యోగాలు కోల్పోకూడదు. జీవించడానికి డబ్బుల్లేని పరిస్థితిలోకి వెళ్లకూడదని మేము కోరుకుంటున్నాం’’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అటు బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్ కూడా బిలియన్ డాలర్ల ప్యాకేజీలను ప్రకటించాయి.
మాంద్యం, టెలికం ఏజీఆర్ ప్రభావం
‘‘మార్కెట్లు మూడేళ్ల కనిష్టం వద్ద క్లోజయ్యాయి. కోవిడ్–19 ప్రభావంతో అంతర్జాతీయ మాంద్యం తప్పదంటూ రేటింగ్ ఏజెన్సీల హెచ్చరికలతో ఆసియా, యరోప్ మార్కెట్లు నష్టపోగా, మన మార్కెట్లు అదే బాట పట్టాయి. అదనంగా సుప్రీంకోర్టు టెలికం కంపెనీలకు ఏజీఆర్ విషయంలో ఎటువంటి ఉపశమనం కల్పించలేదు. దీంతో టెలికం కంపెనీలకు రుణాలిచ్చిన బ్యాంకు స్టాక్స్పై ఎక్కువగా ప్రభావం పడింది. నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ 7 శాతం వరకు పడిపోయింది’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.